నారాయణపేట: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆమె పలు సూచనలు చేశారు. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పూరించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేష్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రెండ్రోజుల పాటు తహసీల్దార్లు ఈ పనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించాలని, పనుల పురోగతిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాకు నిర్దేశించిన 1,144 ఫాంపాండ్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో కనీసం రెండు ఫాంపాండ్ల గ్రౌండ్ చేయాలని సూచించారు. అవసరమైతే వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. వీబీజీ రాంజీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పకడ్బందీగా ఫ్రైడే.. డ్రైడే...
అడపాదడపా కురుస్తున్న వర్షాలతో దోమల వ్యాప్తికి అవకాశం ఉన్నందున.. లార్వా నిర్మూలన కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫ్రైడే డ్రైడే పకడ్బందీగా నిర్వహించాలని, మన ఇల్లు.. మన ఆరోగ్యం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఫీవర్ సర్వేపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక అందించాలని సూచించారు. సీఎం ప్రజావాణి నుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులు వారంలోపు పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ, డీపీవో వెంకట్రాములు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


