● చర్చనీయాంశంగా మారిన
డీఎంహెచ్ఓ పరిశీలన
నారాయణపేట: జిల్లాలోని ధన్వాడలో ఉన్న ధన్వంతరి ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ ఆర్ఎంపీ రోగులకు చికిత్స అందిస్తున్నారన్న సమాచారంతో సోమవా రం జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ తనిఖీ చేయగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం మేరకు.. ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో రోగులకు ఆర్ఎంపీ వైద్యం అందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారని, చికిత్స పొందుతున్న రోగులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఓ పోలీసు అధికారి సైతం చేరుకొని ధ్రువపత్రాలు కూడా పరిశీలించారని, ఆస్పత్రిని సీజ్ చేసేందుకు తహసీల్దార్ను పిలిపించేందుకు సిద్ధమవగా ఇంతలో డీఎంహెచ్ఓకు ఫోన్కాల్్ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫోనన్ మాట్లాడిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సీజ్ చేయాలని భావించిన అధికారులు.. చివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి తనిఖీల్లో ఏం గుర్తించారు? ఆస్పత్రిని ఎందుకు సీజ్ చేయలేదు? తదుపరి చర్యలు ఏమిటి? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్ను వివరణ కోరేందుకు సోమవారం రాత్రి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.


