మక్తల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ డా. వినీత్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. రూ.9,28,00 నగదు, 2 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.7,200 విలువజేసే రెండు మద్యం సీసాలు, రూ.35 వేల విలువైన సిగరెట్లు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. కాగా రూ.5.04 లక్షల నగదు, 13 గ్రాముల బంగారం, 60 తులాల వెండి, 3 సెల్ఫోన్లు, రూ.35 వేల విలువైన సిగరెట్లు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ మహేష్, మక్తల్ సీఐ కె.రాంలాల్, ఎస్ఐలు వై.భాగ్యలక్ష్మిరెడ్డి, పురుషోత్తం, విజయభాస్కర్, సీసీ టాస్క్ఫోర్స్ బృందాలు, మక్తల్ క్రైంస్టాఫ్ శంకరయ్య, అశోక్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


