నారాయణపేట రూరల్: కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర బాధ్యుడు ఎంఎన్ కిష్టప్ప, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్సింగ్ భవన్లో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రెడ్డప్ప అధ్యక్షతన జరగగా.. వారు ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య కామన్ స్కూల్ విధానంలోనే అందించడం సాధ్యమవుతుందని.. ప్రభుత్వమే బాధ్యతగా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు వారి గుర్తింపునకు ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి చొరవ చూపడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. గుప్పెడు విద్యార్థులు చదివే పాఠశాలలకు అధిక నిధులు వెచ్చిస్తున్నారు గానీ లక్షలాదిమంది విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా హేతుబద్దీకరణ పేరుతో యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని మండిపడ్డారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయకుండా, సరిపడా టీచర్లను నియమించకుండా ఉపాధ్యాయులు పనిచేయడం లేదని నింద వేయడానికి యత్నిస్తున్నారే తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు, విద్యా ప్రమాణాలు వేగంగా పడిపోవడానికి కారణాలను అధ్యయనం చేయడం లేదన్నారు. విద్యా ప్రమాణాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న తెలంగాణను మెరుగైన స్థానంలో నిలబెట్టడానికి తక్షణమే విద్యారంగానికి కేటాయింపులు పెంచి పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించాలని.. అప్పుడే నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన పోటీ అలవడుతుందని వివరించారు.
జిల్లా కార్యవర్గం..
విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డప్ప, ప్రధానకార్యదర్శిగా డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శిగా సూర్యచంద్ర, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ధర్మరాజు, సుదర్శన్, ప్రతాప్, సిద్దు, కార్యదర్శులుగా దశరథ్, భరత్కుమార్, చెన్నయ్య, శేఖర్, సాయికుమార్, వెంకటే ష్, కార్యవర్గసభ్యులుగా దేవేందర్, వెంకటప్ప, హై మావతి, గజలప్ప, ఉదయ్కుమార్, రాము, వాల్యానాయక్, పృథ్వి, అసోసియేట్ అధ్యక్షులుగా వెంకట్రాములు, అసోసియేటర్ ప్రధానకార్యదర్శిగా సూర్యప్రకాష్ ఎన్నికయ్యారు.


