ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ప్రతీక్ జైన్
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే గురు లోకమాసంద్ బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, కడా ప్రత్యేక అదికారి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అధికారులు ప్రధాన ఆలయంతో పాటు కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతర వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆర్డీఓ రాంచందర్ నాయక్ను ప్రత్యేక అధికారిగా నియమించామని, సంబంధిత అధికారులు తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జియో, ఎయిర్టెల్ ఏజెన్సీలతో మాట్లాడి సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆర్డీఓకు సూచించారు. వైద్యసిబ్బంది మందులు నిల్వ చేసుకునేందుకు గదిని కేటాయించాలని దేవాదాయశాఖ అధికారిని ఆదేశించారు. అలాగే పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్కు తగిన స్థలం సమకూర్చాలని, చోరీలు జరగకుండా పోలీసులు నిరంతర నిఘా ఉంచాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కోస్గి, నారాయణపేట ఆర్టీసి డిపోల నుంచి 8 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. రెండు పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు ఆర్టీసి డిపో మేనేజర్ లావణ్య కలెక్టర్కు వివరించారు. బస్ పార్కింగ్ స్థలాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డీఎం కోరగా మొబైల్ టాయిలెట్స్ సమకూరుస్తామని డీపీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. జాతరలో దొంగతనాలు, ఈవ్టీజింగ్ జరగకుండా మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేస్తామని, 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని సీఐ సైదులు చెప్పారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావున ఎవరుపడితే వారిని అనుమతించొద్దని, ప్రొటోకాల్ విధిగా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలను దూరంగా ఏర్పాటు చేయించాలన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రంగాారావు, విద్యుత్శాఖ ఎస్ఈ నవీన్కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, పీఆర్ ఈఈ అశోక్, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణారావు, ఎంపీఓ రామన్న, సర్పంచ్ జ్ఞానేశ్వర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు రమేశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


