నారాయణపేట: శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని.. సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పళ్ల హనుమాన్ మందిర్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన ఊరేగింపు చివరకు సుభాష్రోడ్ వరకు కొనసాగింది. అనంతరం బ్రాహ్మణ్వాడి రామాలయంలో సామూహిక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యాయాదవ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు..
మండలంలోని అప్పిరెడ్డిపల్లి రాందేవునిగుట్టపై నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎస్పీ డా. వినీత్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు. ఎస్పీ దంపతులను మార్కెట్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


