తూకం తప్పుతోంది! | - | Sakshi
Sakshi News home page

తూకం తప్పుతోంది!

Mar 15 2026 6:16 AM | Updated on Mar 15 2026 6:16 AM

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి

కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి

వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి

ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గరి నుంచి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

– పాలమూరు

ఇదీ నేపథ్యం

వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక భవనం ఉంది.

● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్‌లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్‌లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది.

● వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్‌ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్‌ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్‌పార్టీ చేసి ఆర్డర్‌ వన్‌సైడ్‌ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్‌పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్‌ వేసుకోవాలి.

వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542-245633 నంబర్‌కు ఫోన్‌ చేయాలి.

టోల్‌ఫ్రీ నంబర్లు..

1967

1800 425 00333

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హెల్ప్‌లైన్‌ నంబర్‌

పౌర సరఫరాల శాఖ

1800 11 4000, 1915

ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది

వినియోగ ఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. వినియోగదారులు ఎయిర్‌లైన్స్‌, మెడికల్‌, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌,టెలికాం, పోస్టల్‌, విద్యుత్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇళ్ల నిర్మాణం, రవాణ, చిట్‌ఫండ్స్‌, వ్యవసాయం, కస్టమర్‌ గూడ్స్‌, కొరియర్‌ సర్వీస్‌, విద్యారంగం, నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల వల్ల వల్ల వినియోగదారులు నష్టపోతే ఇలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది.

● సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్‌, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు.

నాణ్యతపై ప్రశ్నిద్దాం..!

‘నగరానికి చెందిన చంద్రశేఖర్‌, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్‌ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్‌ చాట్‌ వస్త్ర సేవ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్‌ 10న స్లాట్‌ బుకింగ్‌ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్‌ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్‌కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్‌ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్‌ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’

‘నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్‌పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్‌ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్‌ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్‌ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement