
‘అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు’ కు గురుకుల విద్యార్థి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి స్వగ్రామం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్పేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని సాయంత్రం జపాన్కు బయలుదేరి వెళ్తాడు.
ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్స్ తయారీ..
శివారెడ్డి పాఠశాలలో గత మూడేళ్లుగా ఇన్స్పైర్ అవార్డుల్లో పాల్గొంటున్నాడు. టీజీటీ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు, గైడ్ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్ పవర్ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ఉపాధ్యాయులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
రేపు జపాన్ వెళ్లనున్న దామరగిద్ద విద్యార్థి శివారెడ్డి
పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం