
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగా జీవితంలో భాగంగా మార్చుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో శనివారం యోగా క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్యజీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని వాటన్నింటినీ అధిగమించి ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఒత్తిడితోపాటు అంగవైకల్యం, బీపీ, షుగర్, ఇతర మానసిక వ్యాధులు నియంత్రణకు యోగా తోడ్పడుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 7గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేడుకలు విజయవంతం చేద్దాం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న స్థానిక అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పతాంజలి యోగాసమితి, ఆయుష్ విభాగం, సేవా భారతి సంయుక్తంగా చేపడుతుందని, ఈనెల 20న పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో సురేష్, రాజేంద్ర, శివకుమార్, కేతన్, రఘు, నరసింహులు, మల్లికార్జున్, శ్రీనివాస్, చంద్రశేఖర్, దేవానంద్, రమేష్, రఘు, బాలాజీ పాల్గొన్నారు.