● శ్రీశైల దేవస్థానంలో
ఇంజినీర్ల ఇష్టారాజ్యం
● రూ.26.50 లక్షల పనికి
రూ.39 లక్షల బిల్లు
శ్రీశైల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేసిన పైప్పెండ్యాల్స్
క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేసిన అరేబియన్ టెంట్లు (పగోడాలు)
శ్రీశైలంటెంపుల్: కాంట్రాక్టర్లతో ఇంజినీర్లు కుమ్మకై ్క అక్రమాలకు పందిరి వేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనులను చూపిస్తున్నారు. క్షేత్రంలోని పెద్దచెరువు, దామర్లకుంట వద్ద భక్తులు సేదతీరేందుకు రూ.26.50 లక్షల అంచనాతో పైప్ పెండ్యాల్స్, షామియానాలు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఓ కాంట్రాక్టర్ 25.90 శాతం లెస్కు పనులు దక్కించుకుని పూర్తి చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు దేవస్థాన ఇంజినీర్లు నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ ఇచ్చినట్లు సమాచారం. అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా పని పూర్తిగా అయిపోయిన తరువాత పాత తేదీలతో అగ్రిమెంట్ చేసినట్లు తెలిసింది.
డబుల్ ధమాకా!
ఇదిలా ఉండగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రులు, ప్రత్యేక అధికారులు భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో పలుచోట్ల అరేబియన్ టెంట్లు (పగోడాలు) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లెస్ పనిలో మిగిలిపోయిన డబ్బుతో పని చేయించకుండా ఇంజినీర్లు తెలివి ప్రదర్శించారు. లెస్ తక్కువ ఉన్న కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించడంపై పలు అరోపణలు వచ్చాయి. పెద్దచెరువు పని సుమారు రూ.23లక్షలు, శ్రీశైలంలో పనులకు సుమారు రూ.15లక్షలు మొత్తం కలిపి రూ.39లక్షలు బిల్లు చేశారు. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం పని జరగకపోగా, అగ్రిమెంట్ ప్రకారం దక్కించుకున్న లెస్ పోను కాంట్రాక్టర్కు డబుల్ డబ్బు వచ్చేలా బిల్లులు చేశారు.
అక్కడి ఫైల్లో
ఎందుకు రాయాల్సి వచ్చింది
పెద్ద చెరువు, దామర్లకుంట వద్ద చేపట్టిన పని ఫైల్లో శ్రీశైలంలో చేపట్టిన పని ఫైల్ను ఎందుకు రాయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక పనికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కింద 5 శాతం పెంచేందుకు మాత్రమే దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు అనుమతులు ఉంటాయి. అయితే ఈ పనిలో 5 శాతం కంటే ఎక్కువ చేశారు. అంతేకాకుండా దేవస్థాన ఈఓతో నోట్ఫైల్ అప్రూవల్ తీసుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా దేవస్థానం కాంట్రాక్టర్కు చెల్లించిన ఫైనల్ బిల్లు డబ్బుతో శివరాత్రికి ఏర్పాటు చేసిన షామియానాలు, పైప్పెండ్యాల్స్, అరేబియన్ టెంట్లు కొత్తవి కొనుగోలు చేయవచ్చునని పలువురు కాంట్రాక్టర్లు అరోపిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆడిట్ నిర్వహించిన అధికారులు సైతం ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా బిల్లు పాస్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం ఉన్నతాధికారులు క్షేత్ర పరిధిలో పలుచోట్ల అరేబియన్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పని కావడంతో ముందుకు వచ్చిన కాంట్రాక్టర్తో పనులు చేపట్టాం. దేవస్థాన ఈఓతో నోట్ఫైల్ అప్రూవల్, రివైజ్డ్ ఎస్టిమేషన్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నాం. కాంట్రాక్టర్ నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకున్నాం. నిబంధనల ప్రకారమే బిల్లులు చెల్లించాం.
– ఎం.నరసింహారెడ్డి,
శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్


