నందికొట్కూరు: అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన నిందితుడు లొద్దిపల్లి శివకుమార్ను అరెస్టు చేసినట్లు మిడుతూరు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. మండలంలో ప్రజల నుంచి దాదాపు రూ.15.50 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మిడుతూరు గ్రామ శివారులోని బ్రహ్మంగారి మఠం వద్ద ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బైక్, రూ.2.90 లక్షల నగదు సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు.
వ్యక్తి ఆత్మహత్య
బేతంచెర్ల: కొలుములపల్లె గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రా మానికి చెందిన పెద్ద కొక్కల్ల నాగేంద్ర బాబు(37).. భార్య సావిత్రి సొంత గ్రామమైన కొలుములపల్లెలో మూడు నెలలుగా ఉంటున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న నాగేంద్రబాబుకు ఎక్కడ చూపించినా నయం కాలేదు. మనసాప్తం చెందిన అతను శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించుకున్నారు.


