● 412 మందిలో 106 మంది
అధికారులకు ‘సున్నా’ మార్కులు
● అధికారులపై కలెక్టర్ రాజకుమారి
అసంతృప్తి
నంద్యాల: జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 412 మంది అధికారుల పనితీరును ఓపీటీఎస్ ద్వారా అంచనా వేయగా 106 మందికి గ్రీవెన్స్ పరిష్కారంలో ‘సున్నా’ మార్కులు రావడం ఆందోళనకరమన్నారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎండార్స్ చేసిన పిటిషన్లను సైతం కొందరు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మొత్తం 35 ముఖ్యమైన అర్జీలను పెండింగ్లో ఉంచడం లేదా తప్పుడు కారణాలతో మూసివేయడాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యక్ష విచారణ సాగుతోందన్నారు. దేవదాయ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ర్యాంకులు కేటాయిస్తున్నామని చెప్పారు.
వచ్చేవారం నుంచి
పీజీఆర్ఎస్ 9.30గంటల నుంచే
వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహణ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.


