కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 నూతన కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. కర్నూలుకు అదనంగా ఐదు నూత న కోర్టులు, నంద్యాలలో నాలుగు నూతన కోర్టులు మంజూరయ్యాయి. కర్నూలులో 8వ అదనపు జిల్లా కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఆదోనిలో మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఒక జేసీజే కోర్టు మంజూరైంది. ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలంలో ఒక్కొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. ఆయా కోర్టులకు అవసరమైన న్యాయమూర్తులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మిగనూరుకు నూతనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది.


