● ఎస్ఆర్ఓను ఆదేశించిన కలెక్టర్ రాజకుమారి
పాణ్యం: నిబంధనలు అతిక్రమించే దస్తావేజు లేఖర్ల (డాక్యుమెంట్ రైటర్లు)పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమా రి పాణ్యం ఎస్ఆర్ఓ నరేంద్రనాథ్రాజును ఆదేశించారు. బుధవారం ఆమె పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రోజూ కార్యాలయంలో నమోదవుతున్న డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తనిఖీ సమయంలో కార్యాలయానికి ఎదురుగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలను వదిలి పారిపోయారు. గమనించిన కలెక్టర్ ఆ దుకాణాలను తనిఖీ చేశారు. తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్వహణ చేపడితే వెంటనే దుకాణాలను సీజ్ చేయాలని ఎస్ఆర్ఓను ఆదేశించారు. ప్రతి శాఖలోనూ పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక భవిత కేంద్రాన్ని, 5, 6 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత స్థానిక ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసి మెనూ అమలు, పరిసరాల శుభ్రతపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శివశంకర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


