ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీల్లో పెరగనున్న వార్డుల సంఖ్య
పేరు వార్డుల సంఖ్య వార్డుల సంఖ్య
కర్నూలు (టౌన్): కర్నూలు కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం మరోసారి పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు డాక్టర్ పి.సంపత్కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కి పెంచేందుకు చర్యలు చేపట్టింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పదేళ్లుగా ఎన్నికలు లేని కర్నూలు కార్పోరేషన్కు ఎన్నికల ప్రక్రియ చేపట్టింది. అప్పట్లో 49 వార్డులకు గాను కర్నూలు నగర శివారులోని పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు వంటి మూడు గ్రామాలను కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 52కు చేరుకుంది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను పరిగణలోకి తీసుకొని ఈ సంఖ్యను పెంచారు. తాజగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఇక వార్డుల పనర్విభజనపై దృష్టి సారించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం విభజన
కర్నూలు కార్పొరేషన్లో 2011 లెక్కల ప్రకారం 4,50,184 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రకారం వార్డుల సంఖ్యను 68కు పెంచాలని నిర్ణయించడంతో జనాభా సంఖ్య కుదించాల్సి ఉంది. గతంలో వార్డుకు 9 వేల నుంచి 10 వేల మంది జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు. తాజాగా 16 వార్డులను పెంచేందుకు ఒక్కో వార్డుకు 6,500 నుంచి 7,300 మంది జనాభా ప్రకారం లెక్కలు తేల్చాల్సి ఉంది.
పాతబస్తీ, కోడుమూరు అర్బన్లో..
పాతబస్తీ జనాభా 2 లక్షల వరకు ఉంది. ఇక్కడ ప్రధానంగా కర్నూలు నియోజకవర్గం పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే ఇక్కడ ఉన్న 33 వార్డులు తాజాగా 38కి పెరిగే అవకాశం ఉంది. ఇక కోడుమూరు పరిధిలో మూడు వార్డులు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే 30 వేల జనాభా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ సంఖ్య 4 లేదా 5కు చేరుకుంటుంది. ఇలా పునర్విభజనలో వార్డుల తారుమారు తప్పదు.
రేపటి నుంచి ఫీల్డ్లోకి మున్సిపల్ సిబ్బంది
కర్నూలు కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 52 వార్డులను 68కు పెంచాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల వ్యవధిలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం అదికారులు, సచివాలయాల ఉద్యోగులతో కలిసి వార్డుల పర్యటన చేపట్టాల్సి ఉంది.
మునిసిపాలిటీ ప్రస్తుతం ఉన్న పెరగనున్న
కర్నూలు 52 68 ఆదోని 42 52 ఎమ్మిగనూరు 3544 గూడూరు 2023 నంద్యాల 42 52 డోన్ 3236 నందికొట్కూరు 29 32 ఆత్మకూరు 28 32 ఆళ్లగడ్డ 27 32 బేతంచెర్ల 2028
కర్నూలు కార్పొరేషన్ వార్డులు
52 నుంచి 68కి పెంపు
2011 జనాభా లెక్కల ప్రకారం
జనాభా కుదింపు
అత్యధికంగా పాతబస్తీ,
కోడుమూరులో పెరగనున్న వార్డులు
రేపటి నుంచి వార్డుల్లో సర్వే షురూ


