● బీజేపీ, టీడీపీలను హెచ్చరించిన కార్మిక సంఘాలు ● ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహణ
కర్నూలు(సెంట్రల్): ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లను అమలు చేస్తున్న బీజేపీ, టీడీపీలకు పతనం తప్పదని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించాయి. బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలు పట్టుకొని లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా బ్లాక్ డే పాటించారు. ఏఐటీయూసీ నగర కార్యదర్శి బి.వెంకటేష్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మునెప్ప, జిల్లా కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, మాట్లాడుతూ.. బ్రిటీషు కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అన్యాయమన్నారు. ఫీక్స్ టర్మ్ ఎంప్లాయిమెంట్తో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికుల శ్రమను కార్పొరేట్కు దోచి పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ భవిష్యత్లో సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం.నాగన్న, తిరుపాలు, జి.చంద్రశేఖర్, ఎస్.రంజాబీ, ఈ.ఈశ్వర్, నగేష్, నాయకులు అబ్దుల్ దేశాయ్, గోపాల్, రాముడు తదితరులు పాల్గొన్నారు.


