పావనం.. పట్టాభిషేకం
● వైభవంగా బంగారు పాదుకల
అభిషేకం
● ఆకట్టుకున్న బంగారు రథోత్సవం
మంత్రాలయం: వేద మంత్రోచ్ఛారణలు.. భక్తి కీర్తనలు.. మంగళవాయిద్యాలు.. అశేష భక్తజనుల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి గురు భక్తి వైభవోత్సవాలు కనుల పండవగా సాగాయి. వైభవోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో రాఘవేంద్రుల పాదుక పట్టాభిషేకం నిర్వహించారు. తొలుత శ్రీ మఠంలో బంగారు సింహాసనంపై పాదుకలను కొలువుంచి ముత్యాలు, బంగారు నాణేలు, పుష్పాలతో ప్రత్యేక అభిషేకం చేపట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని బంగారు కవచాలతో అలంకరణ చేసి పీఠాధిపతి హారతులు పట్టారు. శ్రీమఠంలో గోపూజ చేపట్టారు.
రమణీయంగా రథయాత్ర
వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల పాదుకలకు బంగారు రథయాత్ర చేపట్టారు. ముందుగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పాదుకలకు హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. శ్రీమఠం అధికారుల బంగారు రథాన్ని ప్రాంగణంలో లాగారు. అశేష భక్తజనం మధ్య రథయాత్ర నిర్వహించారు. పూలు, అరటి ఆకులతో శ్రీమఠం ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు ఉత్సవమూర్తిని ఊరేగించారు.
యజ్ఞశాల ప్రారంభోత్సం
శ్రీమఠంలో యజ్ఞహోమాలు, పూజలు చేసేందుకు నిర్మించిన యజ్ఞశాల శిలాఫకాన్ని ఊంజల మండపంలో శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రారంభించారు. యజ్ఞశాల గ్రౌండు, ఫస్ట్ఫ్లోర్ను బెంగళూరుకు చెందిన కేఎం నాగరాజు కుటుంబ సభ్యులు నిర్మించి ఇచ్చారు. యజ్ఞశాలను నిర్మించి ఇచ్చిన దాతకు శ్రీమఠం పీఠాధిపతి శేషవస్త్రం, ఫలమంత్రాక్షితలు, రాఘవేంద్రులస్వామి జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్లు ఎస్కె.శ్రీనివాసులు, వెంకటేష్జోషి, శ్రీపతిఆచార్, శ్రీమఠం ఇంజినీర్ సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు.
స్వామి పాదుకలను భక్తులకు చూపిస్తున్న శ్రీమఠం పీఠాధిపతి
పావనం.. పట్టాభిషేకం
పావనం.. పట్టాభిషేకం


