అహోబిలం చేరుకున్న పార్వేట పల్లకీ
ఆళ్లగడ్డ: పార్వేట మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ముగించుకుని గురువారం అహోబిలం చేరుకున్న శ్రీ జ్వాలా నృసింహ స్వామి, ప్రహ్లాదవరద స్వాములకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉత్సవమూర్తులను దేవాలయ సన్నిధికి తోడ్కొని వచ్చారు. పార్వేటకు బయలుదేరి 33 రోజుల తరువాత ఉత్సవమూర్తులు అహోబిలం వస్తుండటంతో పండుగ వాతవరణం నెలకొంది. తెల్లవారుజామునే గ్రామస్తులందరూ కులమతాలకు అతీతంగా పుణ్యస్నానాలు ఆచరించి పొలిమేర వద్ద మామిడి తోరణాలు కట్టి సంబరాలు జరుపుకున్నారు. పొలిమేర హద్దు నుంచి దేవాలయం వరకు రహదారి వెంట ఆవుపేడతో కల్లాపు చల్లి మహిళలు రంగవల్లులు వేసి తమ భక్తిని చాటుకున్నారు.
ప్రాయశ్చిత్య హోమం
ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నృసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములకు పండితులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాయశ్చిత్య లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశేష పుష్పాలంకకరణ గావించిన ఉత్సవమూర్తి శ్రీజ్వాలా నృసింహస్వామిని పల్లకీలో కొలువుంచి ఎగువ అహోబిలం తోడ్కొని వచ్చి దేవస్థానంలో కొలువుంచారు. పూజల్లో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయన్, సీఏఓ రామానుజన్ పాల్గొన్నారు.
అహోబిలం చేరుకున్న పార్వేట పల్లకీ


