
రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారండి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా
కర్నూలు(హాస్పిటల్): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని యువతకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా విజ్ఞప్తి చేశారు. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రెడ్క్రాస్ రక్తనిఽధి ఆవరణలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవంగా నిర్వహించుకుంటామన్నారు. ‘తమకు తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే నిస్వార్ధ వ్యక్తులకు గుర్తింపుగా ఈ సంవత్సరం రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి, కలిసి మనం ప్రాణాలను కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ ఏడా ది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలి పారు. జిల్లాలో 45 వేల యూనిట్లు అవసరం కాగా కేవలం 35 వేల యూనిట్లు మాత్రమే లభ్యం అవుతోందన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఈ యేడాది చర్యలు తీసుకోవాలని, కళాశాలల్లో అవగాహన కల్పించి యువతను చైతన్యపరచాలని కోరారు. డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మేలు జరుగుతుందని చెప్పారు. గుండెపనితీరు కూడా మెరుగుపడుతుందన్నారు. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి మాట్లాడుతూ రెడ్క్రాస్ ద్వారా ప్రతి సంవత్సరం ఏడు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నామన్నారు. అంతకుముందు రక్తదానం చేస్తున్న కర్నూలు మెడికల్ కాలేజి పీజీ వైద్య విద్యార్థులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో రక్తదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, కోశాధికారి డాక్టర్ మాధవీశ్యామల పాల్గొన్నారు.