‘ఆసరా’ ఆశలపై నీళ్లు | - | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ ఆశలపై నీళ్లు

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

నల్లగొండ : ఆసరా పింఛన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది అర్హుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ‘చేయూత’ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. కొత్త పింఛన్ల ప్రారంభంపై జూన్‌ 2న ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు. అసలు ఇప్పట్లో పింఛన్లు వస్తాయా లేదా అనే సంశయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

పిల్లలపై ఆధారపడి..

గ్రామీణ ప్రాంతాల్లో వయసు పైబడిన ఎంతో మంది వృద్ధులు కోల్పోయి జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండగా, మరికొందరు కుటుంబ సభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పింఛనే వారికి ఆసరా అవుతుంది. తాజా ఆలస్యంతో మళ్లీ వారికి ఎదురుచూపులే మిగిలాయి.

11 వేల మందికి పైగా కొత్తగా వచ్చే అవకాశం!

ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల వర్గాలకు చెందిన 1,99,567 మంది పింఛన్లు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల పింఛన్లు ఇస్తే జనాభా, అర్హుల ప్రాతిపదికన జిల్లాలో మరో 9 వేల నుంచి 11 వేల మందికి కొత్తగా పింఛన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌ ఆప్షన్‌ రాక నిలిచిన ప్రక్రియ

జూన్‌ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గానీ, ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయడానికి గానీ అవసరమైన ఆన్‌లైన్‌ ఆప్షన్‌ను ప్రభుత్వం ఇంకా అందుబాటులోకి తేలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

ఫ జూన్‌ 2న కొత్త పింఛన్లు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన

ఫ తెలంగాణ అవతరణ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

ఫ కొత్త పింఛన్లపై వీడని సందిగ్ధం.. అర్హులకు తప్పని ఎదురుచూపులు

జిల్లాలో ప్రస్తుతం

అందుతున్న పింఛన్లు

పింఛన్‌ లబ్ధిదారులు

వృద్ధాప్య 69,789

దివ్యాంగ 29,792

వితంతు 77,471

చేనేత 2,825

కల్లుగీత 7,536

ఒంటరి మహిళ 7490

హెచ్‌ఐవీ 3,228

పైలేరియా 1,027

డయాలసిస్‌ 409

మొత్తం 1,99,567

Advertisement
 
Advertisement
Advertisement