సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పూర్తి స్థాయి కార్యవర్గంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పార్టీ సంస్థాగత నిర్మాణంపై జాప్యం జరుగుతోంది. దీంతో జిల్లా పార్టీ కార్యవర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశ తప్పడం లేదు. నాలుగు నెలల కిందటే జిల్లా అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధిష్టానం ఆయా జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేయడంలో వెనుకబడింది. ఇటీవల టీపీసీసీ 14 జిల్లాలకు మాత్రమే పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించగా.. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాలను ప్రకటించలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న వారికి ఉత్కంఠ తప్పడం లేదు.
పెండింగ్లో రెండు జిల్లాల కార్యవర్గాలు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2025 నవంబర్ 22వ తేదీన డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన పున్న కై లాష్ నేత, సూర్యాపేట జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్య, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను జిల్లా అధ్యక్షులుగా నియమించింది. తరువాత వెంటనే జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ అందులో జాప్యం జరగడంతో అధిష్టానం కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఆయా డీసీసీల పూర్తిస్థాయి కార్యవర్గాల ప్రకటనపై టీపీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కార్యవర్గాన్ని ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కమిటీలను పెండింగ్లో పెట్టింది.
ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించని అధిష్టానం
ఫ యాదాద్రి జిల్లాకు ఇటీవల కమిటీ వేసిన టీపీసీసీ
ఫ డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు..
ఫ జిల్లా కమిటీల్లో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపు


