ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నకిరేకల్ : బస్వాపూర్ రిజర్వాయర్ను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో సూమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. మూసీ నదిపైన వంతెన పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన
నల్లగొండ టూటౌన్ : మహిళా సంఘాల పేరుతో రూ.కోటీ 49 లక్షలను ఐసిఐసిఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్, కేశరాజుపల్లికి చెందిన ఆర్పీ స్వాహా చేశారని ఆరోపిస్తూ కేశరాజుపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం నల్లగొండలోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కేశరాజుపల్లి ఆర్పీ తమకు ఎలాంటి సంబంధం లేకుండా సంఘానికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకొని రుణాలు ఎత్తుకున్నట్లు ఆరోపించారు. బ్యాంకు యాజమాన్యం తమకు నోటీసులు ఇవ్వడంతో ఆ విషయం బయటపడిందని.. బ్యాంకులో ఎలాంటి ఖాతాలు లేకుండా మాకు సంబంధం లేకుండా రుణాలు ఎలా ఇస్తారని బ్యాంకు ముందు నిరసన తెలిపామన్నారు. పొదుపు ఖాతాలకు ఐసీఐసీఐ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని యూనియన్ బ్యాంకులో తమ పొదుపులు ఉన్నాయని తెలిపారు. వెంటనే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ ఎస్ఐ మానస అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


