నల్లగొండ టౌన్ : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండికి అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు వస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ను సీపీఐ ఆద్వర్యంలో సందర్శిస్తామన్నారు. ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం పరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో బొల్గూరి నర్సింహ, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రవణ్కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


