పార్కులను మోడల్గా తీర్చిదిద్దుతాం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నగరంలోని పార్కులను మోడల్గా తీర్చిదిద్ది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న పార్కులకు దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 38, 41 డివిజన్లలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని.. శానిటేషన్ మెరుగు పరిచేందుకు ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. నగరంలో రౌడీయిజం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, కమిషనర్ శరత్చంద్ర, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్రెడ్డి, బోయినపల్లి వేదశ్రీ శ్రీనివాస్, బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లలో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్
పది సంవత్సరాల్లో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్కుల అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అమరావతి మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రూ.20 వేల కోట్లతో చేపడుతున్నారని, ఆ హైవే వెంటే బుల్లెట్ ట్రైన్ కూడా వేయబోతున్నారని, దీంతో నల్లగొండ జిల్లా భవిష్యత్లో ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుందన్నారు. రెండేళ్లలోనే నల్లగొండలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండలో కాలుష్యం బారిన పడకుండా పార్కులను అభివృద్ధి చేసి గ్రీనరీని పెంచాలని నిర్ణయించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్ను సూపర్ స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి
వెంకట్రెడ్డి
నీలగిరిలో పార్కుల
అభివృద్ధి పనులకు
శంకుస్థాపన


