ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
● ప్రథమ బహుమతులు గెలుచుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరిరోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు


