● ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోయినా నిర్వహణ
● పత్యేకాధికారి నేతృత్వంలో సర్పంచులు, కార్యదర్శలు, డివిజన్ అధికారులతో కొనసాగింపు
● ప్రతి 45 రోజులకోసారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
● గ్రామాల అభివృద్ధితోపాటుసమస్యల పరిష్కారానికి చర్యలు
● రేపు తేదీలు ఖరారు చేయనున్న జిల్లా ఉన్నతాధికారులు
ఆదేశాలు వచ్చాయి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 మండలాల్లో మండల సర్వసభ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమావేశాలు చేపట్టే విధానం, తేదీల ఖరారు కోసం గురువారం జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నాం. మండల ప్రత్యేకాధికారులతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశంలో చర్చించి.. తేదీలు ఖరారు చేస్తాం. – దేవసహాయం,
అదనపు కలెక్టర్, ఇన్చార్జి జెడ్పీసీఈఓ
మంచి పరిణామం..
ప్రభుత్వం మండల సర్వసభ్య సమావేశాలు 45రోజులకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. దీనివల్ల గ్రామంలోని సమస్యలు అధికారులందరికీ ఒకచోట చెప్పుకొనే అవకాశం లభిస్తుంది. గతంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం సమావేశాలు సమస్యలకు పరిష్కారం చూపే విధించగా పకడ్బందీగా నిర్వహించాలి.
– ఆంజనేయులు, సర్పంచ్, జీడిపల్లి
నాగర్కర్నూల్: ఇక నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల సర్పంచులు, కార్యదర్శులతోపాటు సంబంధిత మండల అధికారులు సమావేశాల్లో పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సీఈఓ అధ్యక్షతన జిల్లాకేంద్రంలో ఎంపీడీఓలతో సమావేశాలు నిర్వహించి.. ఆయా మండల సర్వసభ్య సమావేశాల తేదీల ఖరారు, నిర్వహించే విధానంపై చర్చించనున్నారు.
ఎన్నికల ఆలస్యంతో..
జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి నిర్వహించేవారు. రెండేళ్ల కిందట వారికాలపరిమితి ముగియడంతో ఆ సమావేశాలు లేకుండాపోయా యి. వాటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడంలోనూ ఆలస్యమవుతుండటం వల్ల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పట్టింపు లేకు ండాపోయింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు లేకపోయినా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో..
మండల, జెడ్పీ పాలకవర్గాలు ఉన్న సమయంలో సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా నిర్వహించేవారు. వీటికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు డివిజన్ స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవారు. ఈ క్రమంలో సమావేశాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అధికారుల పనితీరుపై నిలదీసేవారు. కానీ, 2024 జూన్ 24న గత పరిషత్ పాలకవర్గం ముగిసింది. అప్పటి నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు లేకుండా పోయాయి. ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారులు బాధ్యత వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్, కలెక్టర్లు ఈ ఆదేశాలను ఆయా జిల్లాలో వెంటనే అమలు చేయాలని చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల వద్దనే..
సర్వసభ్య సమావేశాలు లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల నాయకులు ఎమ్మెల్యేల వద్ద విన్నవించుకొని అధికారులకు చెప్పించి పరిష్కంచేవారు. సర్పంచులు వచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొని తీర్చుకుంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సర్పంచులు ఎవరి వద్దకు వెళ్లి వారి గ్రామాల సమస్యలు విన్నవించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


