తిమ్మాజిపేట: భూముల రీసర్వేలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మండలంలోని మరికల్ గ్రామంలో భూముల రీసర్వే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సర్వేయర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పైలెట్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎంపిక చేసిన మరికల్ గ్రామంలో భూముల సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేస్తే మీ మండలంలో మరో గ్రామం ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. రీసర్వేకు సంబంధించిన పురోగతి ఏ మేరకు రీసర్వే చేస్తున్నారు.. ఇంకా జరగాల్సిన రీ సర్వే వివరాలను మండల సర్వేయర్ సాయిబాబను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలోని చెరువులు, కుంటల సర్వే కొనసాగుతుందని, సర్వేయర్ల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. లైసెన్సుడ్ సర్వేయర్లు తమకు పారితోషికం రావడం లేదని సర్వేకు దూరంగా ఉంటున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరో ఇద్దరు సర్వేయర్లను కేటాయించాలని కోరగా.. లైసెన్సుడ్ సర్వేయర్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, జిల్లా సర్వేయర్ గిరిధర్, తహసీల్దార్ జయంతి, ఎంఆర్ఐ అ నురాధ, జీపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల రవాణా అంశాలపై సమస్యలు, సలహాలు తెలిపేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నం.94937 33602కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు.
మద్దిమడుగు ఆలయ హుండీ లెక్కింపు
అమ్రాబాద్: పదర మండలంలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం హుండీని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సమక్షంలో లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం రూ.59,38,103 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదు కానుకలతోపాటు మిశ్రమ వెండి 2.600 కిలోలు వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈఓ రంగారావు, అధికారులు పరందామరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, నాగరాజు, అర్చకులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


