కోడేరు: శాసీ్త్రయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పటేల్ అన్నారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీసీ ద్వారా నిర్వహించగా కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి రైతువేదికలో పాల్గొని మాట్లాడారు. రైతులకు సరైన సమయంలో సరైన సాంకేతిక సలహాలు అందించడం వల్ల వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చన్నారు. రైతులు సంప్రదాయ సాగు విధానాలతోపాటు శాసీ్త్రయ పద్ధతులు అవలంభిస్తే ఉత్పాదకత పెరగడంతోపాటు సాగు వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి చెందిన రైతులు వీరారెడ్డి, లోకేశ్వర్, బాలరాజులను శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు అభినందించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్, మహాత్మజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, ఇందిరమ్మ ఇళ్లు, స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు.
సర్ డిజిటలైజేషన్ పూర్తిచేయండి..
మండలంలోని పస్పులలో చేపట్టిన సర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా రూపొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సేకరించాలని అవసరమైతే కుటుంబ సభ్యుల సమాచారం తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయరాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఎం కృష్ణ, అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ జమీల్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఆర్ఐ సురేందర్, సర్పంచ్లు సుల్తానమ్మ, మహేశ్వర్రెడ్డి, ఏపీఎం గౌస్, వ్యవసాయాధికారి నాగజ్యోతి, శిరీష, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


