తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం తాడూరులో ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, హక్కుల సాధన కోసం కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి.. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరుశరాములు, కిరణ్కుమార్, జైపాల్రెడ్డి, ఫయాజ్, శివశంకర్, సత్యం పాల్గొన్నారు.


