నాగర్కర్నూల్: నకిలీ డీఏపీ సూత్రదారులపై పీడియాక్ట్ నమోదు చేయాలని, రైతుల జీవితాలతో రాజకీయం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందా.. లేక వారి అనుచరుల హస్తం ఉందా అనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వలన వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా తెచ్చిన కరువని దుయ్యబట్టారు. మొక్కజొన్న కొనుగోలులోనూ గన్నీ బ్యాగుల ట్రాన్స్పోర్టు డబ్బులు, బిజినేపల్లిలో రైతులను ముంచిన దళారులు, నకిలీ డీఏపీ సూత్రదారులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన 34 శాతం నీటి వాటాలో కేవలం 22 శాతమే వినియోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీశైలం, హన్మంతురావు తదితరులు పాల్గొన్నారు.


