అచ్చంపేట రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ధ్వజమెత్తారు. నీట్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడం.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాలు బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం.. అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం.. వారిపై నిర్బంధ చర్యలకు దిగడం అత్యంత దురదృష్టకరమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను విరమించి.. విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


