పెద్దకొత్తపల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం సూచించారు. పెద్దకొత్తపల్లిలోని ఆయిల్పాం కొనుగోలు కేంద్రంలో సేకరించిన గెలలను బుధవారం ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తోటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో పండించే ఉద్యాన తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్పాం సాగుచేసిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై.. 30 ఏళ్ల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం ఉంటుందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 110 టన్నుల గెలలను పెద్దకొత్తపల్లిలోని కేంద్రం వద్ద సేకరించినట్లు పేర్కొన్నారు. టన్నుకు రూ. 23,783 ధర పలుకుతుందని.. సేకరించిన గెలలకు 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.


