కల్వకుర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా చేయడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు తదితర అంశాలపై మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జిల్లాలో కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల పరిస్థితి, ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలు, రహదారుల పక్కనున్న దాబాలు, హోటళ్ల అనుమతులు, భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, అంబులెన్స్ సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమగ్రంగా సమీక్షించి.. అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ప్రతినెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశమై, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి పౌరుడు విధిగా రోడ్డు నిబంధనలను పాటించి, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్టీఓ ఇమ్రాన్ అహ్మద్ తదితరులు ఉన్నారు.


