సాయంత్రం కుప్పకట్టాల | - | Sakshi
Sakshi News home page

సాయంత్రం కుప్పకట్టాల

May 31 2026 12:54 AM | Updated on May 31 2026 12:54 AM

ధాన్యం మొత్తం కొంటాం..

రాజకీయంగా విమర్శలు

జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోళ్ల కోసం 200 కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొల్లాపూర్‌లో మెప్మా, మిగతా చోట్ల సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిర్ణీత తేమశాతం వచ్చిన ధాన్యాన్ని రోజువారిగా కాంటా వేస్తున్నాం. ఇప్పటి వరకు 38 వేల మె.ట., ధాన్యం కొని.. మిల్లులకు తరలిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం మొత్తం కొంటాం.

– రాజేందర్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం

ఎండనక.. వాననక.. చలనక.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలు.. చేతికొచ్చిన దిగుబడులను అమ్ముకోవడానికి అదే రీతిలో కష్టపడుతున్నారు. దళారులకు అమ్మితే నష్టపోతామని భావించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుందని ఆశపడితే.. ధాన్యం అమ్మి, గోదాంలకు తరలించే వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తేమ శాతం, తూకం వేయడం, నిల్వ కేంద్రాలకు తరలించడం ఒక ఎత్తయితే.. అకాల వర్షాల బారినుంచి పంటను కాపాడుకోవడం మరో ఎత్తవుతుంది. ఈ మధ్యలో అధికారులు పెట్టే కొర్రీలు అన్నీ ఇన్నీ

కాకపోగా.. ధాన్యానికి సంబంధించి అన్నిరకాల బాధ్యతలు రైతులపైనే మోపుతుండటంతో అరిగోస పడుతున్నారు. – కొల్లాపూర్‌

జిల్లాలో కేఎల్‌ఐ ప్రాజెక్టుతోపాటు వాగులు, చెరువుల కింద రైతులు పెద్ద మొత్తంలో పంటలు సాగు చేశారు. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న ధాన్యాన్ని పండించగా.. రెండు నెలల క్రితమే ప్రభుత్వం కొనుగోలు చేపట్టింది. కానీ, ఇప్పటికీ పలుచోట్ల మొక్క జొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తుంది. సకాలంలో కాంటా వేయకపోవడం, కాంటా వేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ యార్డుల నుంచి ధాన్యం గోదాంలకు చేరే వరకు రైతులదే బాధ్యత అని అధికారులు చెబుతుండడంతో చేసేది లేక రోజుల తరబడి మార్కెట్‌ యార్డుల్లోనే నిరీక్షిస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు పూర్తికాక ముందే వరిధాన్యం కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్‌ యార్డుల్లో ఒకపక్క వరిధాన్యం, మరోపక్క మొక్కజొన్న ఆరబెట్టేందుకు కూడా స్థలాలు లేకపోవడంతో చాలా గ్రామాల్లో రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. కొనుగోలు కూడా అక్కడే జరుతున్నాయి.

సగమైనా కొనలే..

జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మె.ట., వరిధాన్యం పండినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకు కేవలం 41 వేల మె.ట., ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు చేరగా.. వీటిలో 38 వేల మె.ట., ధాన్యాన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఓ వైపు ఇబ్బందులు పడుతుండగా.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు అధికారులు కూడా అవస్థలు పడుతున్నారు. సరిపడా గోదాంలు లేకపోవడం, రవాణా కోసం లారీలు అందుబాటులో ఉండకపోవడం, హమాలీల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. పూర్తిస్థాయిలో రైతులు పండించిన వరిధాన్యం మార్కెట్‌కు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

దయనీయంగా మారిన అన్నదాత పరిస్థితి

ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాట్లు

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

మరోవైపు మార్కెట్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు

అన్ని బాధ్యతలు రైతుల మీదే

మోపుతున్న అధికార యంత్రాంగం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులను ఆదేశిస్తున్నారు. మంత్రి ముందు సరే అంటున్న అధికారులు ఆ తర్వాత తేమశాతం వచ్చే వరకు ధాన్యం కొనేది లేదని రైతులకు చెబుతున్నారు. ఈ క్రమంలో కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మర్రి జనార్దన్‌రెడ్డి గోదాంల వద్దకు వెళ్లి తానే దగ్గర ఉండి లారీలను అన్‌లోడ్‌ చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement