నిబంధనలు కఠినం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు కఠినం

May 31 2026 12:54 AM | Updated on May 31 2026 12:54 AM

ప్రైవేట్‌ కళాశాలల్లో లోపం.. ప్రభుత్వ గుర్తింపులో జాప్యం

గద్వాల మినహా మిగతా జిల్లాల్లోఅనుమతులు నిల్‌

అయోమయంలో పది పూర్తి చేసినవిద్యార్థులు

నారాయణపేట రూరల్‌: పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉండగా.. జూనియర్‌ కళాశాలలు ఏటా అిఫిలియేషన్‌ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలలకు నామమాత్రంగా అనుమతులు ఇస్తుండగా, ప్రైవేట్‌ కళాశాలలకు మాత్రం అన్నిరకాల సౌకర్యాలు పరిశీలించి నిబంధనల ప్రకారం విద్యార్థుల అడ్మీషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా వాటిని మరింత కచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఇంటర్‌బోర్డు అదే పద్ధతిలో ముందుకుసాగుతోంది.

నిబందనలు ఇలా..

వాస్తవంగా అన్నిరకాల విద్యాసంస్థలు కొత్తగా తెరిచే సమయంలో అనుమతులు తీసుకుంటారు. పాఠశాలలకు పదేళ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కాని కళాశాలలు మాత్రం ఏటా అనుమతి తీసుకోవాలి. దీనికి అన్నిరకాల పత్రాలు సమర్పించడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్‌లోని కళాశాలలకు నామమాత్రంగా నిబంధనలు వర్తింజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ అధికారులు ఇచ్చే బిల్డింగ్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికేట్‌, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ వారు ఇచ్చే శానిటరీ సర్టిఫికేట్‌, అగ్నిమాపకశాఖ ఇచ్చే ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికేట్లతో వారికి అనుమతులు ఇస్తున్నారు. ఇక ప్రైవేట్‌ కళాశాలల విషయంలో గతంలో కంటే ప్రస్తుతం నిబంధనలు కట్టుదిట్టం చేశారు. ప్రతి కళాశాల తప్పకుండా ఎన్‌ఓసీ అందిస్తూ ఆటస్థలం, గుర్తింపు పత్రం, సరిపడ అధ్యాపకులు, సిబ్బంది, సామగ్రి, ల్యాబ్‌, గ్రంథాలయం, రూ.4 లక్షల ఎఫ్‌డీ బాండ్లు, బిల్డింగ్‌ లీజ్‌ డీడ్‌ తదితర వివరాలు తెలియజేయాలి. ఇక అద్దె భవనం, ఆట స్థలం అయితే తప్పకుండా లీజ్‌ డీడ్‌ విద్యా సంవత్సరానికి సరిపడా సమయం ధ్రువపత్రం జత చేయాల్సి ఉంది. కళాశాల భవనంలో ఇతర వ్యాపార సంస్థలు ఉండరాదనే నిబంధన కచ్చితంగా పరిశీలిస్తున్నారు. మౌలిక వసతులు, అగ్నిమాపక అనుమతులు తప్పనిసరి చేశారు.

2026–27 సంవత్సరానికిగాను..

నిబంధనలు కఠినతరం చేయడంతో అన్ని సౌకర్యాలు లేని కళాశాలలకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను గుర్తింపు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలో 71 జనరల్‌, 31 ఒకేషనల్‌ ప్రైవేట్‌ కళాశాలు ఉండగా.. కేవలం 13 కళాశాలలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. అవి కూడా అన్ని గద్వాల జిల్లాకు చెందినవి కావడం విశేషం. ఇక నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌లో ఏ ఒక్క కళాశాలకు కూడా అఫ్లియేషన్‌ ప్రక్రియ పూర్తికాలేదు. దరఖాస్తు గడువు పూర్తయినా వివిధ కారణాలతో చాలా కళాశాలలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

కొనసాగుతున్న

ప్రవేశాలు..?

సోమవారం నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అయినా ప్రైవేట్‌ కళాశాలలకు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అనుమతులు రాని కళాశాలలు సైతం అిఫిలియేషన్‌ విషయాన్ని బయటకు చెప్పకుండా కళాశాల ఫారంపై విద్యార్థుల నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కళాశాలల్లో చేర్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ గుర్తింపు రాకపోతే వారి పరిస్థితి ఏమిటని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement