కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్, వ్యవసాయ, రవాణా, రెవెన్యూ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నందున, ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం, హమాలీ, లోడింగ్, రవాణా వంటి అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్ పాల్గొన్నారు.
జూన్ 15 నాటికి పూర్తి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జూన్ 15 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీసీలో జిల్లాలో వరి కొనుగోళ్ల కోసం చేపట్టిన ఏర్పాట్లు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం సేకరణ పురోగతి, అకాల వర్షాల ప్రభావంతో తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు.


