ఆహ్లాదం..
● పర్యాటకులను ఆకర్షిస్తున్న నల్లమల అందాలు
● నేటి నుంచి యువజన, క్రీడలు, పర్యాటక వారోత్సవాలు
అచ్చంపేట: కనుచూపు మేర పచ్చని చెట్లు.. చల్లని గాలులు.. పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఆధ్మాత్మిక క్షేత్రాలు.. పరవళ్లు తొక్కుతూ సాగిపోయే కృష్ణమ్మ అందాలతో ప్రకృతి రమణీయతకు నిలయం నల్లమల. కుటుంబ సమేతంగా నల్లమల, కృష్ణానదిలో ప్రయాణిస్తే మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు. పర్యాకులు నల్లమల అడవి, కృష్ణానది అందాలను ఆస్వాదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం రూపకల్పన చేసింది. అయితే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన, క్రీడలు, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నల్లమల ప్రాంతంలో రాష్ట్ర చారిత్రక వారస్వత సంపద, సంస్కృతి, ఎకో టూరిజం ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడం.. పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించేలా చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైతన్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని సంబంధిత అధికారులు తెలిపారు. అడవిలో ఒక రోజు పాటు పూర్తిగా గడపాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మన్ననూర్ జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజీ (ఫర్హాబాద్ టూరిజం ప్యాకేజీ)తో పాటు అక్కమదేవి– దోమలపెంట టూర్ స్టే ప్యాకేజీలు అమలు చేస్తోంది. దట్టమైన అడవిలో సుమారు 20 కి.మీ. దూరం టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ.. వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించవచ్చు. టైగర్ స్టే ప్యాకేజీ కోసం పర్యాటకులు amrabadtigerreserve.comలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


