వంగూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. వంగూరు మండల కేంద్రంతోపాటు పోల్కంపల్లిలో రూ. 30కోట్లతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పనులను శుక్రవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు చేస్తోందన్నారు. పాఠశాల భవనాల్లో విశాలమైన తరగతి గదులతో పాటు లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు తదితర సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరంలాంటివని.. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ, త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాలో మొదటగా ఈ రెండు పాఠశాలలనే ఎంపిక చేయడం జరిగిందని.. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


