నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ.. సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలు ప్రాంతాల నుంచి ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 9 ఫిర్యాదులు అందగా.. వాటిలో 5 తగు న్యాయం కోసం, 2 భూతగాదా, 2 కుటుంబ తగాదాపై ఉన్నాయని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా.. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకుసాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు.


