రిజర్వేషన్లు ఖరారు..
సాక్షి, నాగర్కర్నూల్: ఊగిసలాడుతూ.. వాయిదాలు పడుతూ వస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరోసారి కీలక ఘట్టానికి చేరుకుంది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా అధికారులు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేశారు. కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వాతావరణం ఊపందుకుంది. రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో నేడో, రేపో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.
50శాతం కోటా మేరకు మార్పులు..
ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చేసిన ప్రక్రియతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలరోజుల్లోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను సవరించింది. మొత్తం కోటా 50 శాతానికే పరిమితం చేస్తూ.. గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు 2019 సాధారణ ఎన్నికల సమయంలో చేసిన రిజర్వేషన్లనే అనుసరిస్తూ.. రొటేషన్ ప్రాతిపదికన మార్పులు చేసింది. ఎట్టకేలకు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం కావడంతో గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది.
ఎస్టీ వర్గానికి అత్యధికంగా 133 స్థానాలు..
జిల్లాలో 460 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో అత్యధికంగా 133 స్థానాలను ఎస్టీ వర్గానికి కేటాయించారు. ఎస్సీలకు 85, బీసీలకు 61, జనరల్కు 181 స్థానాలను కేటాయించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించడంతో పాటు మిగిలిన స్థానాల్లోనూ కోటా మేరకు రిజర్వేషన్ కల్పించడంతో ఎస్టీలకు అత్యధికంగా 133 స్థానాలు రిజర్వు అయ్యాయి.
ప్రత్యేక వ్యూహాలతో పార్టీలు..
ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో రాజకీయ వేడిని పెంచాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటామని భావిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే విస్త్రృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనతో వ్యూహాన్ని పన్నుతోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహంచగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.
ఎస్సీ
85
బీసీ 61
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ సామగ్రిని అందుబాటులో ఉంచింది. ఇప్పటికే విడతల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసింది. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు.
అధికార
యంత్రాంగం
సిద్ధం..
గ్రామ పంచాయతీలు,
వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన
నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
పల్లెల్లో మళ్లీ మొదలైన సందడి
రిజర్వేషన్లు ఖరారు..


