‘తెల్ల’బోతున్నారు..!
ప్రకృతి వైపరీత్యాలతో ముంచెత్తిన భారీ వర్షాలు.. సోకిన తెగుళ్లతో పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు దాదాపు రెట్టింపు ఖర్చులు పెట్టారు. పెట్టుబడి అయినా వస్తదనే ఆశతో అష్టకష్టాలు పడ్డారు. చివరకు అంతంత మాత్రంగానే చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు సైతం వారు నానాతంటాలు పడుతున్నారు. తొలుత ‘కపాస్’ కష్టాలు, తేమ.. ఆ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామనే సీసీఐ కొర్రీలు.. తాజాగా జిన్నింగ్ వ్యాపారుల పిలుపు మేరకు నిలిచిన కొనుగోళ్లతో నరకయాతన అనుభవిస్తున్నారు. విధిలేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ.. దక్కని మద్దతు ధరతో రైతుల విలవిల్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్
సీసీఐ సెంటర్లలో కొన్నది 12,75,810.50క్వింటాళ్లే..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 7,35,909 ఎకరాల్లో పత్తి సాగైంది. 69,52,022 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 12,75,810.50 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. నారాయణపేట జిల్లాలో పత్తి దిగుబడి అంచనా 14,67,738 క్వింటాళ్లు కాగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఐ కేంద్రాల్లో ఇప్పటివరకు 90,511 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అదే ప్రైవేట్ వ్యాపారులు 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇదే పరిస్థితి ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉంది. వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పత్తి రైతులు పక్క జిల్లాలకు తీసుకెళ్లారు.
కొర్రీలపై కొర్రీలు..
ఈ ఏడాది వానాకాలం పత్తి కొనుగోళ్లలో తొలి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సీజన్లోనే అందుబాటులోకి తెచ్చిన కపాస్ యాప్ కష్టాలను తెచ్చింది. యాప్లో రైతులు, పంట నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లకు అవకాశం ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేసేలా కొత్త నిబంధన పెట్టి.. యాప్లో మార్పు చేయడం తంటాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల, మహబూబ్నగర్ రూరల్ మండలంలోని అప్పాయిపల్లి.. నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మరోవైపు తేమ ఎనిమిది నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే కొర్రీ వెంటాడుతోంది. దీంతో రైతులు పత్తిని ఆరబెడుతూ కొనుగోళ్లకు పడిగాపులు కాయక తప్పడం లేదు.
‘ప్రైవేట్శ్రీలో నిలువు దోపిడీ..
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో కొర్రీల నేపథ్యంలో రైతులు విధిలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు ధర భారీగా తగ్గించారు. సీసీఐ సెంటర్లలో ప్రభుత్వం క్వింటాల్కు రూ.8,110 మద్దతుతో కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.5,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు.
సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్తో చిక్కులు
తొలుత కపాస్ కష్టాలు.. తేమ ఇక్కట్లు
ఆ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామని మెలిక
తాజాగా జిన్నింగ్ మిల్లుల అల్టిమేటంతో నిలిచిన క్రయవిక్రయాలు
నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రైతుల ఆందోళన
విధిలేని పరిస్థితుల్లో ‘ప్రైవేట్’లో అమ్మకాలు
దక్కని మద్దతు ధరతో విలవిల
నిలిచిన కొనుగోళ్లు.. పలు చోట్ల ఆందోళనలు
జిన్నింగ్ వ్యాపారుల బంద్తో సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేట్ వద్ద ఎన్హెచ్–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు.
‘తెల్ల’బోతున్నారు..!


