వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు
పాన్గల్: రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చే యాలంటూ గురువారం పాన్గల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యయాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలు చాలా గ్రామాల రైతులకు అందలేదన్నారు. అధికారులు కొందరు నాయకులకే పెద్ద మొత్తంలో అందించి. అర్హులైన రైతులను విస్మరించారని ఆరోపించారు. విత్తనాల పంపిణీపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఏఓ మణిచందర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మండలానికి వచ్చిన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని.. ఇంకా విత్తనాలు అందని రైతుల విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని, మంజూరైతే పంపిణీ చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు.


