
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ముందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన తప్పనిసరి
కొల్లాపూర్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కొల్లాపూర్ జూనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి ఉపనిషధ్వాణి అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ మీటింగ్ హాల్లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరైనా కాలరాస్తే న్యాయస్థానాలకు ఆశ్రయించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మహిళా చట్టాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు, సీఐ మహేశ్, న్యాయవాదులు భూజల భాస్కర్రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.
నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం
కల్వకుర్తి రూరల్: జిల్లాలో నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామని డ్రగ్ ఇన్స్పెక్టర్ విశ్వంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ తయారీ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లేదా టోల్ఫ్రీ 18005996969 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాలని తెలిపారు. జిల్లాలోని మందుల షాపుల్లో నకిలీ, నాణ్యతలేని మందులు రాకుండా నివారించి.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన కోరారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ కేవీ నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించి విద్యుత్ వినియోగదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సమస్య నెలకొంటే అధికారులు లేదా సిబ్బంది దృష్టికి తీసుకురావాలని వినియోగదారులకు సూచించారు. రైతులు పంట పొలాల్లో ఏర్పాటుచేసుకున్న ట్రాన్స్ఫార్మర్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ స్వతహాగా మరమ్మతు చేయరాదని.. ఏదైనా సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ప్రతి వారంలో మూడు రోజులు మంగళ, గురు, శనివారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు