వాజేడు: మండల పరిధిలోని మొరుమూరు గ్రామంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ సువర్ణ, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి కలిసి నర్సరీని ప్రారంభించారు. కర్రెగుట్టలకు వారు వచ్చే దారిలో మంగళవారం ఆగి కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించి పరిశీలించారు. మొక్కలను సక్రమంగా పెంచాలని సూచించారు. అనంతరం కన్జర్వేటర్ సువర్ణ ప్రగళ్లపల్లి గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన బీట్ ఆఫీసర్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
వెంకటాపురం(కె): పేదల పక్షాన పోరాడేది సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. అనంతరం వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎస్ఎస్ తాడ్వాయి : ఏజెన్సీలోని వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ గిరిజనులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని, వారి ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని లింగాలలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం మంగళవారం స్థానిక ఆదివాసీ రైతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పంట రుణాల పేరిట ఒక్కొక్క కుటుంబానికి రూ. 30 లక్షలు అప్పుగా చూపిస్తూ పలువురి నుంచి భూములను ఆక్రమించుకోవడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. 1960 వ్యాపారాల చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం విరుద్దమని పేర్కొన్నారు. ఇలా అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో సైతం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక ఆదివాసీ రైతులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన గ్రామస్తుల కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. యువత బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదకరమన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంగిస్తే భారీ జరిమానాలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీర్ల చంద్రశేఖర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్కుమార్, సాయిశశాంక్ పాల్గొన్నారు.


