ములుగు/ములుగు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకరతో కలిసి తాగు, సాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. ఏజెన్సీలోని గొత్తికోయ గూడేల్లో చేతి పంపులు, ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ప్రతీ పంచాయతీలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేయకపోతే లబ్ధిదారులు మహిళ సంఘంలో ఉంటే వారికి వెంటనే రూ.లక్ష రుణం అందేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.200 కోట్లతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మల్లంపల్లిని ఆదర్శ పంచాయతీగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లిలో సీఆర్ఆర్ నిధులు రూ.72.50 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10లక్షల నిధులతో గ్రామైఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రలో భాగంగా మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తామని హామీనిచ్చి నేరవేర్చారని తెలిపారు. మల్లంపల్లి మండలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
మంత్రి ధనసరి సీతక్క


