● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: జిల్లాలో నేటి నుంచి నిర్వహించే గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డుల్లో సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామ సభల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని కొత్తగా మరికొన్ని చేపట్టబోతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామసభల సందర్భంగా ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చేవారి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వెంకటాపురం(కె): సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సౌర విద్యుత్ వినియోగంపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్, ముఫ్త్ బిజిలియోజన, కుసుం పథకాలపై వివరించారు. మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగించుకుంటున్న వినియోగదారులు పీఎం జుగా స్కీమ్ కింద మీటర్లు పొందవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం సౌర విద్యుత్ వినియోగంపై కరపత్రాలను వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెంకటాపురం(ఎం) మండలం నల్లగుంట గ్రామానికి చెందిన భూక్య జవహర్లాల్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి పాటుపడినందుకు పదవిని కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు బలరాం, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్ల డించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి పాల్గొన్నారు.


