ములుగు రూరల్: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసిన లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్స్టేషన్కు గాని, 100కు కాల్ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు.
డీఆర్డీఓ, అదనపు కలెక్టర్ సంపత్రావుకు అవార్డు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రక్తం అందజేసిన ములుగు డీఆర్డీఓ, అదనపు కలెక్టర్ సంపత్రావుకు అవార్డును ప్రదానం చేశారు. ఈ మేరకు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాజ్భవన్లో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అత్యధికంగా బ్లడ్ యూనిట్లను అందించినందుకు గాను కేటగిరి–1 విభాగంలో అవార్డుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ ప్రతినిధులు డాక్టర్ విజయ్చందర్రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ తప్పనిసరి
ములుగు రూరల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై వెంకటేశ్వర్రావు శనివారం ఒక ప్రటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదని వివరించారు. వాహనదారులు వాహనపత్రాలతో పాటు, లైసెన్స్, నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని సూచించారు. లేని పక్షంలో వాహనం సీజ్ చేయడంతో పాటు ఫైన్ విధించడం జరుగుతుందని వెల్లడించారు.
విమాన ప్రమాద ఘటన బాధాకరం
ములుగు రూరల్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 290 మంది మృతి చెందడం బాధాకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ పోరిక రవిందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల హాస్టల్ భవనంపై కూలడంతో 50మంది విద్యార్థులు దుర్మరణం చెందడం దారుణమని తెలిపారు. వైద్య విద్యార్థులను కోల్పోవడం దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రీ ప్రైమరీ తరగతులు
ప్రారంభించాలి
గోవిందరావుపేట: అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. జీపీఎఫ్, సరెండర్, మెడికల్ మొదలగు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న తెలుగు. హిందీ పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చి ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గొప్ప సమ్మారావు, వాసుదేవ రెడ్డి, ములకాల వెంకటస్వామి, కొండ చెంచయ్య, కె.రఘురాం, కె.శివరాం, జి.పురుషోత్తం, పి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం