
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి దీవించారు.
కలెక్టర్ సమీక్షతో అభివృద్ధికి
అడుగులు పడేనా?
మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో మే 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర)ఏర్పాట్లపై కలెక్టర్ దివాకర నేడు(సోమవారం) వివిధ శాఖల అధికారులతో సాయంత్రం రివ్యూ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 9రోజుల పాటు సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు 12న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు చేపట్టనున్న ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంతోనైనా ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మే 8నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు
నేడు అధికారులతో కలెక్టర్ సమీక్ష