
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేకు తీవ్ర విషాదం మిగిల్చింది. ఇదే ఫ్లైట్లో తన బంధువు మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన మామయ్య అయిన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించాడని విక్రాంత్ తన బాధను వ్యక్తం చేశారు. విక్రాంత్ తన బంధువు మృతికి సంతాపం తెలుపుతూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలందరికీ తన సానుభూతిని తెలియజేశారు.
విక్రాంత్ మాస్సే ఇన్స్టాలో రాస్తూ..' "ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన ఊహించలేని విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూసి నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్ను కోల్పోయారని తెలిసి మరింత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఈ విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి" అని రాసుకొచ్చారు.

కాగా.. గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు.