
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?
'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)
ఇప్పుడు కూడా సడన్గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.
ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.
(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?)